AmmaVodi 1000 Rs - Donation by Parents for Govt Schools for Sanitary Cleaning ESE02-28021

అమ్మఒడి ద్వారా నగదు పొందినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో పరిశుభ్రత నిర్వహణ కొరకు అమ్మబడి నగదు నుంచి వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం సూచనలు File No.ESE02-28021/21/2019-PLG -CSE
ఆర్.సి.నం: ఇ ఎస్ ఇ 02-2802/1/ 121/ 2019-ప్లానింగ్/సి.ఎస్.ఇ, తేది: 26.1.2020

AmmaVodi 1000 Rs - Donation for Govt Schools for Sanitary Cleaning ESE02-28021

విషయం: పాఠశాల విద్య-పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణను మెరుగుపర్చడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయడంగురించి-

ఆదేశములు:
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44,570 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువునభ్యసిస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా బాలికల వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా పాఠశాలల్లోని పారిశుద్ధ్య గదుల్ని సక్రమంగా నిర్వహించవలసిన ఆవశ్యకత ఉన్నది.
  • 2. జనవరి 9 వ తేదీనాడు చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు తల్లులందరికీ ఈ సందర్భంగా ఒక పిలుపునిచ్చారు. అమ్మఒడి కార్యక్రమం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం పొందిన తల్లులు తమకు అందిన ఆర్థిక సహాయంలో తమ వంతు విరాళం కింద రు.1000/- (అక్షరాలా వెయ్యి రూపాయలు) పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి అందచేయగలందులకు, ఆ విధంగా జమచేసిన సొమ్ముతో తల్లిదండ్రుల కమిటీలు పాఠశాలలోని పారిశుద్ధ్యగదుల నిర్వహణకు తగిన చర్యలు చేపట్టగలందులకీ వారు విజ్ఞప్తి చేసియున్నారు.
3. కాబట్టి, గౌరవనీయ ముఖ్యమంత్రిగారు ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు తదుపరి చర్యలు తీసుకోవడం కోసం ఈ దిగువ చూపిన విధంగా చర్య చేపట్టవలసిందిగా ఆదేశించనైనది.
  • • పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 30.01.2020న తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణ గురించి తీసుకోవలసిన చర్యలను వివరించి అది తల్లిదండ్రుల బాధ్యతగా వారికి విశదీకరించాలి.
  • • ఆ సమావేశానికి హాజరైన తల్లులు వారి వంతు విరాళంగా ప్రతి ఒక్కరు రూ.1000/తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకు జమ చెయ్యవలసిందిగా అభ్యర్థించాలి.
  • • జిల్లా విద్యాశాఖాధికారి పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా తెరవవలెను.
  • • తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకి తల్లులు వారి వంతు విరాళంగా జమ చేసిన డబ్బుని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణ కొరకు జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో తెరచిన బ్యాంకు ఖాతాకు జమ చేయవలెను.
  • • పాఠశాలలోని పారిశుద్ధ్య గదుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి ఒక ఆయాను తల్లిదండ్రుల కమిటీనే ఎంపికచేసుకోవడానికి సహకరించాలి.
  • • ఆ విధంగా ఎంపిక చేసుకున్న ఆయాకు నెలకు రూ.4,000/- చొప్పున చెల్లించగలందులకు తల్లిదండ్రుల కమిటీ ద్వారా తీర్మానించాలి.
  • • జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా నుండి జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి నెలా రూ. 4,000/- చొప్పున పాఠశాలలోని పారిశుద్ధ్య గదులను శుభ్రం చేస్తున్న ఆయాకు గౌరవ వేతనం చెల్లించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్వహిస్తున్న తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకి ఆన్లైన్ ద్వారా జమ చేయవలెను.
  • • ఆ విధంగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకి జమ చేయబడిన డబ్బును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల పారిశుద్ధ్య గదులను శుభ్రపరుస్తున్న ఆయా యొక్క బ్యాంకు ఖాతాకు జమ చేయవలెను.
  • • పాఠశాల పారిశుద్ధ్య గదులను శుభ్రపరుస్తున్న ఆయాలకు వాటి పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రి అనగా బ్రష్టులు, చీపుళ్ళు, ఫినాయిలు వగైరా సమకూర్చుకోవడానికి అయ్యే వ్యయం కొరకు నెలకు రూ.2000/- చొప్పున పాఠశాలకిచ్చే కాంపొజిట్ గ్రాంటులనుండి సమకూర్చాలి.
  • • ఆ విధంగా పాఠశాలల్లో పారిశుద్ధ్యం సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించి ఫొటో ద్వారా తెలియపర్చాలి. ఇందుకు అవసరమైన డిజిటల్ టూల్ రూపొందించడం జరుగుతున్నది.
  • • తల్లిదండ్రుల కమిటీలో ఉన్న సభ్యుల నుండి ముగ్గురిని తల్లిదండ్రుల సబ్ కమిటీగా ఏర్పాటు చేయవలెను. ఆ సబ్ కమిటీ వారు పాఠశాల ఆవరణలో ఉన్న పారిశుద్ధ్య గదుల నిర్వహణను ప్రతి రోజు స్వయంగా పర్యవేక్షించి అందులో లోటుపాట్లను ప్రధానోపాధ్యాయునికి దృష్టికి మరియు తల్లిదండ్రుల కమిటీ దృష్టికి తీసుకురావలెను.
  • • అదే విధంగా గ్రామ సచివాలయంలోని విద్య-సంక్షేమ సహాయకుడు వారానికి మూడుసార్లు పాఠశాల ఆవరణలో ఉన్న పారిశుద్ధ్యపు గదుల నిర్వహణను స్వయంగా పరిశీలించి ఫొటో తీసి ఆన్ లైన్లో పొందుపరచాలి.
  • • ప్రతి మూడు నెలలకు ఒకసారి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు జరుగుతున్నదీ లేనిదీ స్వతంత్ర సంస్థ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. ఇందుకు గ్రామంలోని స్వయం సహాయక బృందాల సహకారం తీసుకోవడం జరుగుతుంది.
  • • పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు జరిగేలా చూడటంలో విద్యార్థుల పాత్ర కూడా ముఖ్యమైనది. ఇందుకు గాను విద్యార్థులకు తాము పారిశుద్ధ్యపుగదుల్ని వినియోగించిన తరువాత వాటిని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచడం గురించి తప్పనిసరిగా తెలియపరచాలి.
  • • పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ గురించి ప్రతినెలా తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో తప్పనిసరిగా సమీక్షించాలి. లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని మెరుగుపర్చుకోవడం కోసం తగిన చర్యలు చేపట్టాలి.
  • • పారిశుద్ధ్య నిర్వహణలో నీటి వినియోగం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా, నీళ్ళు వృథా చెయ్యకుండా చూసేటట్లు కూడా సూచనలు ఇస్తుండాలి.
  • • సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయంలో ఉన్న కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసరుకు ఈ సూచనలు అమలు పరచవలసిన బాధ్యత అప్పగించాలి.
4. ఈ అంశం మీద తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కలగడం కోసం మరియు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ తప్పనిసరిగా (01-02-2020 నుండి అమలు జరిగేటట్లు తగిన చర్యలు చేపట్టాలి.

5. జిల్లాలోని విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మొత్తం పాఠశాల్ని సందర్శించి పాఠశాల సిబ్బందిని, తల్లిదండ్రుల కమిటీలని జాగరూకుల్ని చెయ్యడం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.

6 . ఈ ఆదేశాలమీద తీసుకున్న చర్యను ప్రతి రోజూ కమిషనర్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదించాలి.